Sunday, February 19

శ్రీవేంకటేశ్వరుని నిత్యసేవలు (2)

తోమాలసేవ (భోగశ్రీనివాసమూర్తికి అభిషేకం)

పుష్పాలంకార ప్రియుడైన శ్రీనివాసుని దివ్యమంగళమూర్తికి అనేక పుష్పమాలికలతో, తులసిమాలలతో చేసే అలంకారమే తోమాలసేవ. సుప్రభాతం తరువాత ఉదయం 3గంటలకు ప్రారంభమవుతుంది. జియ్యంగార్ తెచ్చిన మాలలను అర్చకస్వాములు నీళ్ళుచల్లి శుద్ధిచేసి తీసుకుంటారు. భోగశ్రీనివాసమూర్తికి అభిషేకం తరువాత, శ్రీవేంకటేశ్వరుని నిజపాదాలపై ఉన్న బంగారు తొడుగులకు కూడా అభిషేకం చేస్తారు.

ఈ అభిషేకానికి ఆకాశగంగ జలాన్ని మాత్రమే వాడుతారు. అనంతరం మూలమూర్తికి, వక్షఃస్థల లక్ష్మికి, శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామికి, ఉగ్ర శ్రీనివాసమూర్తికి, ఇలా సన్నిధిలో ఉన్న పంచబేరాలకు అభిషేకం చేయించినట్లుగా ఆకాశగంగా తీర్థాన్ని సంప్రోక్షిస్తారు.

అభిషేకానంతరం భోగశ్రీనివాసమూర్తికి వస్త్రాలంకరణ, తిలకధారణ చేసి, మిగిలిన ఉత్సవమూర్తులకు షోడశోపచారాలు సమర్పిస్తూండగా, "తిరుప్పళ్ళీ ఎళుచ్చి" అను అరువది పాశురాలను పారాయణం చేస్తారు.

తోమాలసేవ (వెంకన్నకు పుష్పాలంకారం)

జియ్యంగార్లు శ్రద్ధాభక్తులతో అందించే పూలమాలలను అర్చకస్వాములు శ్రీవారికి అలంకరిస్తారు. ఈ పుష్పాలంకరణ శ్రీవారి పాదాలతో ప్రరంభమవుతుంది. ఆపాదమస్తకం అలంకరించే ఈ పూలమాలలకు కొన్ని స్థరమైన పేర్లు ఉన్నాయి.
శ్రీవారి పాదాలపై అలంకరించే ఒక్కొక్క మూరగల రెండు పుష్పమాలలను "తిరువడి దండలు" అని
శ్రీవారి కిరీటం మీదుగా రెండు భుజాల వరకు అలంకరించబడే 8మూరలకు గల పూలమాలలను " శిఖామణి" అని
శ్రీవారి భుజాలనుండి ఇరువైపులా పాదాలవరకు వ్రేలాడుతున్నట్లు అలంకరించే పొడవాటి మాలలను "సాలగ్రామమాల" అని
శ్రీవారి మెడలో రెండు పొరలుగా భుజాలమీదకి అలంకరించబడే మూడున్నర మూరల పుష్పహారాన్ని "కంఠసరి" అని అంటారు.
శ్రీవారి వక్షస్థలంలో ఉన్న శ్రీదేవి, భూదేవులకు ఒక్కటిన్నర మూరల పుష్పమాలికలను అలంకరిస్తారు.
ఒక్కొక్కటి ఒక్కొక్క మూర ఉన్న రెండు దండలను శంఖచక్రాలకు అలంకరిస్తారు
శ్రీవారి నందకఖడ్గానికి అలంకరించే రెండు మూరల పుష్పమాలికను "కఠారిసరం" అంటారు.
రెండు మోచేతులు క్రిందనుండి పాదాల వరకు హారాలుగా వ్రేలాడదీసే మూడు పుష్పమాలలము "తావళములు" అంటారు.
పుష్పాలంకరణ పూర్తి అయిన తరువాత వేదపండితులు మంత్రపుష్పాన్ని పఠిస్తారు. ధూప, దీప, నక్షత్ర, కర్పూర హారతులు ఇస్తారు. ఈ కార్యక్రమం అంతా పూర్తికావడానికి సుమారు అరగంటకు పైగా పడుతుంది.

కొలువు (దర్బార్)

బంగారు వాకిలికి ఆనుకుని లోపల ఉన్న గదిని "స్నపన మండపం" అంటారు. అక్కడే ప్రతీరోజూ శ్రీవారికి ఆస్థానం జరుగుతుంది. ఈ సేవ పూర్తిగా ఏకాంతం. ఆలయ అధికారులు, అర్చకులచే నిర్వహించబడుతుంది. ఉదయం 4-30 లకు ప్రారంభమవుతుంది.

స్వామికి షోడశోపచారాలు నిర్వహించిన తరువాత, ఆస్థానసిద్ధంతి శ్రీనివాసునికి పంచాంగ శ్రవణం చేస్తూ, తిధి, వార, నక్షత్ర, యోగ, కరణాలను వినిపిస్తారు. నిత్యాన్న ప్రసాద పధకంలో విశేషమైన విరాళాలు ఇచ్చిన దాతల పేర్లను శ్రీవారికి వినిపిస్తారు.

బొక్కసం (లెక్కల) గుమాస్తా, శ్రీవారికి సమర్పించబడిన ముందునాటి ఆదాయ వివరాలను ఆర్జితసేవలవల్ల, ప్రసాదాల విక్రయం వల్ల. హుండీద్వారా, కానుకలుగా వచ్చిన బంగారు, వెండి, రాగి, ఇతర లోహపాత్రలు, నగలు, వగైరాల ద్వార వచ్చిన నికర ఆదాయాన్ని పైసలతో సహా లెక్కగట్టి శ్రీనివాసునికి వివరంగా వినిపించి, భక్తితో సాష్టాంగ నమస్కారం చేసి సెలవు తీసుకుంటాడు.

Saturday, February 18

మహా శివరాత్రి

శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే
శివశ్చ హృదయం విష్ణుః విష్ణోశ్చ హృదయం శివః
ప్రతీ మాసంలో వచ్చే కృష్ణ పక్ష చతుర్దశి, పరమేశ్వరునికి అతి ప్రీతికరమైనది. అందుకే ఆ రోజును మాస శివరాత్రిగా పిలుస్తారు. అంతేగాక మాఘ బహుళ చతుర్దశి, శివునికి మరీ మరీ ఇష్టం. కావున ఆ రోజును మహా శివరాత్రిగా పాటిస్తాము.

శివాలయంలో ప్రదక్షిణా విధానం :

నందికి ఏ పక్కనుండి లోపలికి వెళ్తామో, అదే పక్కనుండి మాత్రమే వెనక్కు రావాలి
శివలింగం, నంది మధ్య నుండి లోపలికి వెళ్ళకూడదు.
నంది కొమ్ముల మధ్య నుండి చూస్తు శివుడిని స్మరించాలి.

జాగారం ఎందుకు?

శివరాత్రి అర్ధరాత్రి జ్యోతిర్మయమైన మహాలింగంగా శివుడు అవతరించాడు. అంతటి పుణ్య ఘడియలలో నిద్ర కు చోటివ్వడం తగదు.
నైవేద్యం చిమ్మిలి, విప్పనూనెతో దీపం పెట్టాలి. బిల్వ పత్రాలతో పూజ చేయాలి.
శివపంచాక్షరి జపంతో సర్వసిద్ధులను పొందవచ్చు. గురువు ఉపదేశాన్ని పొంది, సుఖాసనంపై కుర్చొని జపం చేయాలి.
శివుడు అభిషేక ప్రియుడు. మంచినీటితో అభిషేకం చేసినా భక్తుల కోర్కెలు తీర్చే భోలా శంకరుడు. విభూది అభిషేకం కూడ మంచిది.

మారేడు...

"మారేడు నీవని ఏరేరి తేనా, మారేడు దళములు నీ పూజకు" మనందరికి ఈ పాట విదితమే. దానధర్మాలు. యఙ్ఞ, యాగాలు చేయలేకపోయినా ఒక్క మారేడు దళముతో ఆ శివుడిని పూజిస్తే అంతకంటే మించినది లేదు. "త్రిదళం త్రిగుణాకరం, త్రినేత్రంచ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం". మారేడు వృక్ష మూలంలో బ్రహ్మ, మధ్యభాగంలో విష్ణువు, అగ్రభాగంలో ఈశ్వరుడు ఉంటారు.

మారేడు మహిమ

ఇంట్లో ఫ్రిడ్జ్ లేనివారు 10మారేడు ఆకులను బిందెడు నీటిలోవేస్తే, సరిగ్గా 10నిమిషాలలో నీరు చల్లబడుతాయి.

Thursday, February 16

శ్రీవేంకటేశ్వరుని నిత్యసేవలు (1)

తిరుమలలో శ్రీవెంకటేశ్వరునికి జరిగే నిత్య సేవల గురించి మనం వినే ఉంటాం. ప్రతీ ఒక్కరు అన్నింటీని చూడలేకపోయినా, కనీసం చూసినవారి ద్వారా అయినా లేక పుస్తకాల ద్వారా అయినా తెల్సుకుని ఉంటారు.
నిత్యసేవల గురించి పూర్తి వివరణతో ఇటీవల(2012లో) తి.తి.దే. వారు విడుదల చేసిన " గోవిందం - పరమానందం" పుస్తకం బాగుంది. సేవల గురించిన వివరణ చాలా చక్కగా అందించారు. తి.తి.దే వారు అందించిన సేవల వివరాలను నేను ఇక్కడ అందిస్తున్నాను.




కౌసల్యా సుప్రజా రామ | పూర్వాసంధ్యా ప్రవర్తతే|
ఉత్తిష్ట నరశార్దూల | కర్తవ్యం దైవ మాహ్నికం||

తరతరాలుగా, హైందవ జాతిలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని జాగృతం చేస్తున్న మహత్తర శ్రీవేంకటేశ్వరస్తవం ఈ సుప్రభాతం. 29శ్లోకములున్న సుప్రభాతాన్ని, 11శ్లోకాలున్న స్తోత్రాన్ని, 16శ్లోకాలున్న ప్రపత్తిని, 14శ్లోకాలున్న మంగళాశాసనాన్ని, 15వ శతాబ్దంలో మనవాళ మహాముని శిష్యులైన ప్రతివాదభయంకరాణ్ణన్ స్వామి రచించారు. వీరి అసలు పేరు హస్తిగిరినాధన్. ఈ దివ్యగానాన్ని ఎక్కడ విన్నా, మనస్సు తిరుమల క్షేత్రాన్ని చేరుకుంటుంది. అలౌకికాననందంతో, శ్రీవారి సామీప్య సాన్నిధ్యాన్ని అనుభవిస్తుంది. అంతటి మహత్తు కలిగిన ఈ సుప్రభాత గీతాన్ని, తిరుమలలో సుప్రభాత సేవ జరిగే విధానాన్ని గురించి తెలుసుకుందాం.

ప్రతిరోజూ బ్రాహ్మిముహుర్తాన (తెల్లవారుఝాము 2.30-3.00 గంటల మధ్య) తిరుమల ఆలయంలో శ్రీవారికి సుప్రభాత సేవ జరుగుతుంది. అ సమయంలో సన్నిధిగొల్ల స్నానాదికాలు పూర్తిచేసుకుని, తిరునామం ధరించి, దివిటీ పట్టుకుని, తిరుమల ఉత్తర మాడవీధిలోని అర్చకుల ఇంటికి వెళతాడు. శ్రీవారి కైంకర్యపరులైన వైఖానస అర్చకులు అప్పటికే స్నానసంధ్యావందనాది అనుష్టానాలను పుర్తిచేసుకుని సిద్ధంగా ఉంటారు.

సన్నిధిగొల్ల వారికి నమస్కరించి, వారిని శ్రీవారి ఆలయానికి ఆహ్వానిస్తాడు. వారు శ్రీవారి బంగారువాకిలిని తెరిచే పరికరమైన కుంచెకోల అనే కొడవలి వంటి ఇనుపకొక్కీని భుజంపై పెట్టుకుని, తాళంచెవులను తీసుకుని శ్రీవారిని స్మరిస్తూ సన్నిధిగొల్లను అనుసరిస్తారు.

ఇలా అర్చకస్వాములు మహద్వారం వద్దకు చేరగానే నగారామండపంలో పెద్ద పలకగంట (నౌబత్ఖానా)ను హెచ్చరికగా మ్రొగిస్తారు. ఆఘంటానాదంతో మహాద్వారం తెరువబడుతుంది. సన్నిధిగొల్లను అనుసరిస్తున్న అర్చకులు ప్రధానద్వార దేవతలకు మంత్రపూర్వక ప్రణామాలర్పిస్తూ ఆలయప్రవేశం చేస్తారు. వారివద్ద ఉన్న కుంచెకోలను, తాళంచెవులను, ధ్వజస్తంభం వద్ద ఉన్న క్షేత్రపాలకశిలకు భక్తితో తాకించి, నమస్కరించి, ద్వజస్తంభానికి ప్రదక్షిణగా వెండివాకిలిని దాటి బంగారువాకిలి ముందు మౌనంగా స్వామివార్ని ధ్యానం చేస్తూంటారు.

వారిని అక్కడవదిలి, సన్నిధిగొల్ల మరల శ్రీవారి సన్నిధివీధిలోని బేడి ఆంజనేయస్వామిగుడివద్ద ఉన్న శ్రీమాన్ పెద్దజియ్యంగార్ మఠానికి వస్తాడు. అప్పటికే సిద్ధంగా ఉన్న జియ్యంగారిని, లేదా వారి పరిచారకుడైన ఏకాంగినీ ఆహ్వానించి ఆలయానికి వెంటబెట్టుకుని వస్తాడు. ఆ సమయానికి ఆలయ అధికారి, పేష్కారు, శ్రీవారి సుప్రభాతాన్ని పఠించే వేదపండితులు, బంగారు వాకిళ్ల ముందు నిలిచిఉంటారు. అలాగే తాళ్లపాక అన్నమయ్య వంశీయులొకరు తంబుర చేత ధరించి, మేలుకొలుపు సంకీర్తన పాడటానికి సిద్ధంగా ఉంటారు. ఇంతలో సుప్రభాత సేవకు నిర్ణీతరుసుమును చెల్లించిన భక్తులు బంగారువాకిలి ముందుకు అనుమతిస్తారు.

ఆర్చకులు, జియ్యంగార్, ఆలయ అధికారులు, వేదపండితులు, తాళ్లపాకవారు, సన్నిధిగొల్ల, సుప్రభాతసేవా భక్తులు వీళ్లందరి సమక్షంలో అర్చకులు తమదగ్గర ఉన్న కుంచెకోలతో బంగారువాకిలికి గల చిన్న రంధ్రం ద్వార లోపల వేసిఉన్న గడియను తీస్తారు. తరువాత గడియకు వేయబడిన తాళాన్ని అర్చకులు తమవద్ద ఉన్న తాళాలతో తీస్తారు. అటు తరువాత సన్నిధిగొల్ల పేష్కారు దగ్గర గల సీలువేసిన చిన్నసంచిలో ఉన్న తాళంచెవులతో, సీలువేయబడిఉన్న మూడు పెద్దతాళాలను అందరికీ చూపించి తీస్తాడు.

బంగారు వాకిలి తెరుచుకుని సన్నిధిగొల్ల దివిటీతో ముందుగా లోనికి ప్రవేశిస్స్తారు. మరుక్షణం శ్రీహరి అర్చకులు మధురస్వరమో "కౌసల్యా సుప్రజా రామా" అంటూ సుప్రభాతాన్ని ఆలపిస్తూ బంగారువాకిలిలోకి ప్రవేశిస్తారు. ఏకాంగి, మహంతుమఠం వారు తెచ్చిన పాలు, చక్కెర, వెన్న, తాంబూలం గల పళ్లెరాన్ని అందుకుని లోనికి వెళ్ళుతారు. బంగారువాకిళ్ళు దగ్గరకు మూయబడుతాయి.

బంగారు వాకిలి ముందు ఉన్న వేదపండితులు, అర్చకులు ప్రారంభించిన సుప్రభాతగీతాన్ని అందుకుని శ్రుతిశుభగంగా ఆలపిస్తారు. స్తోత్రం, ప్రపత్తి, మంగళాశాసనం పూర్తైన తరువాత, అన్నమయ్య వంశీయులు బంగారువాకిలి ముందు నిలబడి, అన్నమయ్య రచించిన ఒక మేలుకొలుపు కీర్తనను భూపాలరాగంలో గానం చేస్తారు.
సుప్రభాతంలో శ్రుతికలిపి, అన్నమయ్య మేలుకొలుపు పాటను ఆలకిస్తూ, భక్తిప్రపత్తులతో మైమరిచి ఉన్న భక్తులు బంగారు వాకిళను ఎప్పుడు తెరుస్తారో, శ్రీవారి దివ్యమంగళరూపం ఎప్పుడు దర్శిస్తామో అని ఒళ్ళంతా కళ్ళు చేసుకుని వేచిఉంటారు.

బంగారువాకిలిని దగ్గరగా మూసిన సన్నిధిగొల్ల వద్ద ఉన్న దివిటివెలుగులో, అర్చకులు రాములవారిమేడకు వేసిఉన్న తలుపు తాళాలను తీసి, శయనమండపంలో పానుపుపై ఉన్న భోగశ్రీనివాసమూర్తికి ప్రదక్షిణంగా సన్నిధికి చేరుకుంటారు. దివిటెతో ముందుగా లోపలికి వెళ్ళిన సన్నిధిగొల్ల, కులశేఖరపడి వద్ద నిలచి, ఆ వెలుగులో శ్రీవారి దివ్యమంగళమూర్తిని తొలిదర్శనం చేసుకుంటారు. అనంతరం శ్రీవారి అర్చకస్వాములు, ఏకాంగి, కులశేఖరపడి దాటి లోపలకు ప్రవేశిస్తారు.

గొల్లచేతిలో ఉన్న దివిటీని అందుకుని ఏకాంగి సన్నిధి లోని దీపాలను వెలిగించగా, సన్నిధిగొల్ల రాములవారి మేడలోని దీపాలను వెలిగిస్తాడు. తరువాత అర్చకులు శ్రీవారికి పాదనమస్కారం చెసి, శయనమండపంలో బంగారు పట్టుపరుపు పై పవళించి ఉన్న భోగశ్రీనివాసమూర్తిని సమీపించి, నమస్కరించి, చప్పట్లు చరిచి, మేల్కొనవలసిందిగా ప్రార్ధిస్తారు. అంతట భోగశ్రీనివాసమూర్తి విగ్రహాన్ని మూలమూర్తి సన్నిధిలో వేంపుచేవు చేస్తారు.